కలం, వెబ్ డెస్క్: గత 2023 సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi-Balakrishna) ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు భారీ చిత్రాలు ఒకే పండగ సీజన్లో తలపడినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద రెండూ అద్భుతమైన వసూళ్లతో ఘనవిజయాలు సాధించాయి. ఇరు హీరోల అభిమానులు థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ సంక్రాంతిని మరింత గుర్తుండిపోయేలా చేశారు. ఇప్పుడు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’, అలాగే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 2027 సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ అగ్ర హీరోల పండగ పోటీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలకూ కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి లాంటి పెద్ద సీజన్లో పోటీ ఉండటం వల్ల సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంపై ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో అంచనాలు లేవు. ఇలాంటి సమయంలో బాలకృష్ణ (Chiranjeevi-Balakrishna)తో నేరుగా తలపడటం మెగాస్టార్ చిత్రానికి ఒక రకంగా ప్లస్ కానుంది. ఈ బాక్సాఫీస్ వార్ వల్ల కలిగే విపరీతమైన హైప్ సినిమాకు అదనపు బూస్ట్ని ఇస్తుంది. ఒకవేళ కంటెంట్ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే.. ‘విశ్వంభర’ మూవీ మరో వాల్తేరు వీరయ్య తరహా మ్యాజిక్ను రిపీట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

