కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై హై కమాండ్ తో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఎవరి హద్దులో వారు ఉండాలని.. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో పార్టీకి తెలుసని.. కష్టపడిన వారికి పార్టీ కచ్చితంగా గుర్తింపునిస్తుందని తెలిపారు. ఎవరైనా ఏ వేదికపై ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఉందని.. ఆ విషయంపై తాను ఢిల్లీకి వెళ్లి మాట్లాడుకోవచ్చని చెప్పారు.
రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పుచేతల్లో ఉండొద్దని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప, కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేయొద్దన్నారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాను కాంగ్రెస్లోనే ఉంటానని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పెద్ద పదవుల్లో ఉన్నారు. ఇది సహించరానిది” అంటూ రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

