కలం, తెలంగాణ బ్యూరో : ఖరీఫ్ సీజన్ రైతుభరోసా నిధుల (Rythu Bharosa Funds) ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద రూ. 2,482 కోట్లను ఈ వేదికగా సీఎం రిలీజ్ చేస్తారు. రెండు ఎకరాల వరకు ఉన్న 41.37 లక్షల మంది రైతులందరికీ నిధులు జమ అవుతాయి. తొలుత ఈ సభను ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని చింతకానిలో ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
దానికి తగిన ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ భారీ వర్షంతో అక్కడ సభ నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సభను అక్కడే జరిగేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కానీ చివరకు అది హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు షిప్ట్ అయింది. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల రైతులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొంటారు.
సభకు ఆటంకమైనా రైతు భరోసా నిధుల యధాతథం :
భారీ వర్షాల కారణంగా మధిరలోని సభ వాయిదా పడినా రైతుభరోసా నిధుల విడుదల మాత్రం యధావిధిగా కొనసాగాలని భావించిన ప్రభుత్వం వేదికను హైదరాబాద్కు షిప్ట్ చేసింది. ఖరీఫ్ సాగు ప్రారంభమై రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోడానికి వీలుగా ఈ నిధులను ఇస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కీలక సమయంలోనే పెట్టుబడి సాయం అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, అందుకే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు.
ఖరీఫ్ రైతు భరోసా ఇలా :
• తొలి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు.
• రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు.
• మొత్తంగా రెండు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ రూ. 2,482.02 కోట్లు విడుదల.
• మిగిలిన రైతులకు కూడా దశలవారీగా నిధులు రిలీజ్.
• కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులకు కూడా అవకాశం. జూలై 5 లోపు వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే లబ్ధిదారుల జాబితాలో చేరుతారు.

