కలం, వెబ్ డెస్క్: డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు కేవలం 5 రోజుల్లోనే ఆ నగదు మొత్తాన్ని బ్యాంకులు తిరిగి తమ అకౌంట్లలో జమ చేయాలని ఆదేశించింది. ఒక వేళ బ్యాంక్ వైపు సాంకేతిక లోపాటు ఉంటే ఖాతాదారుడు ఫిర్యాదు చేయకపోయినా డబ్బు మొత్తం బ్యాంకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగినప్పుడు, బాధితులు 5 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఆ నష్టానికి ఖాతాదారులకు ఎలాంటి బాధ్యత ఉండదు. అయితే వినియోగదారులు తమ ఓటీపీ లేదా పాస్వర్డ్లను ఇతరులతో షేర్ చేయడం వల్ల నష్టపోతే మాత్రం దానికి వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
వినియోగదారుల రక్షణ కోసం తీసుకొస్తున్న ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ ప్రత్యేక సదుపాయం అందరికీ అన్ని వేళలా వర్తించదు. మొదటిసారి రూ.50,000 లోపు నష్టపోయిన వారికి మాత్రమే, అది కూడా జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఈ వెసులుబాటు లభిస్తుంది. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు, అదే సమయంలో ఖాతాదారులు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేసేందుకు ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

