కలం, వెబ్ డెస్క్: స్పెయిన్ (Spain)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి భవనంపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన దంపతులు సుభాషినిరెడ్డి, గుణాకర్రెడ్డిల ఏకైక కుమారుడు గీట్ల సాయి అఖిల్ రెడ్డి (Sai Akhil Reddy). అతడు ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం స్పెయిన్ వెళ్లాడు.
అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఆదివారం అఖిల్ భవనంపై నుంచి కిందపడి మరణించాడని అతడి బంధువులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రస్తుతం అఖిల్ కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. విద్యార్థి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

