కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ (Himayat Sagar) రిజర్వాయర్ గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో వెయ్యి క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. ఇన్ ఫ్లో పెరుగుతున్న కొద్ది రిజర్వాయర్ బ్యాలెన్స్ నేపథ్యంలో గేట్లను ఎత్తినట్లు వివరించారు. రిజర్వాయర్ ఇన్ ఫ్లోపై నిరంతరం పర్యవేక్షణ చేసి, నీటి విడుదల విషయంలో మార్పులు చేర్పులు చేస్తామని వివరించారు.
ఈ సీజన్లో ఇదే మొదటిసారి..
ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైన భాగ్యనగరంలో అనుకున్నంత మేర వానలు పడలేదు. అయినా, హిమాయత్ సాగర్ పరివాహక పరిధిలో నిన్న మొన్న పడిన వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. దీంతో సీజన్లో మొదటిసారి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

