కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 30న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’(Rythu Aashirvada Sabha) ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) పరిశీలించారు. ఆదివారం ఆయన అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక, రైతుల సీటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలను సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో రైతులు హాజరుకానున్న నేపధ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వాతావరణ శాఖ వర్ష సూచన ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం వచ్చినా కార్యక్రమం కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

