కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లా గుర్రంపోడు మండలం వెంకటాపురం (ఎస్) గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 28 ఏళ్ల వివాహిత అరుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన కూతురిని భర్తే కొట్టి చంపాడంటూ మృతురాలి తల్లి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. అరుణ మరణించిన తర్వాత ఆమె భర్త స్వయంగా మృతదేహాన్ని తీసుకువచ్చి, ఆమె తల్లిగారి ఇంటి ముందు వదిలివెళ్లాడు. అరుణ శరీరంపై గాయాలు ఉండటం, మరణానికి గల కారణాలు చెప్పకుండా భర్త వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.
కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కొట్టి చంపాడని ఆరోపిస్తూ మృతురాలి తల్లి వెంటనే గుర్రంపోడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుర్రంపోడు పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారు. అరుణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అరుణ మరణానికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని నిఘా అధికారులు తెలిపారు. ఈ ఘటనతో వెంకటాపురం (ఎస్) గ్రామంలో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

