కలం, వెబ్ డెస్క్ : గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత వీబీ-జీ రామ్-జీ చట్టం–2025ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) అన్నారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన రెండో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ చట్టం ద్వారా 60 రోజుల ఉపాధి పరిమితిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామీణ పేదలకు 200 రోజుల ఉపాధి కల్పించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కర్నాటక, కేరళతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని చెప్పారు.
అంతేకాదు తెలంగాణకు ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ప్రజా ప్రభుత్వం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూలై 2న జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

