కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ (Donald Trump Avenue)ను హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో అధికారికంగా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్లాన్ చేసిన ఈ రహదారి ఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్గియో గోర్ కలిసి ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక గౌరవంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా స్పందించారు. భారత్కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి గౌరవం పొందిన తొలి అమెరికా అధ్యక్షుడు తానేనని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ రోడ్డు ఆవిష్కరణ కార్యక్రమం అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (ఫ్రీడమ్ 250) సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ పరిధిలో జరిగింది. హైదరాబాద్లో ఐటీ, గ్లోబల్ ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల పేర్లను వీధులకు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి 2025లోనే ప్రతిపాదించారు. అందులో భాగంగానే యూఎస్ కాన్సులేట్ ఉన్న ఈ వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ఈ చర్య భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.

