కలం, ఖమ్మం బ్యూరో: ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో ఖమ్మం (Khammam) జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. చింతకాని మండలం జగన్నాధపురంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో అడిషనల్ డీసీపీ రామానుజం శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రయాణించే ప్రధాన మార్గాలు, బహిరంగ సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అలాగే సభకు హాజరయ్యే ప్రజలు, అధికారులు సులభంగా రాకపోకలు సాగించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. భద్రతాపరంగా కీలకమైన ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రామానుజం (DCP Ramanujam) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వీఐపీ కాన్వాయ్ ప్రయాణించే మార్గాలలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
జగన్నాధపురంలో నిర్వహించనున్న రైతు మేళాకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

