కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలురు)ను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి(ITDA PO) మంద మకరందు (Manda Makarandu) (ఐఏఎస్) గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా, వసతి, పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రిజిస్టర్లు , కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలపై ఆరా తీశారు.
అనంతరం వంటగది, భోజనశాల, మరుగుదొడ్ల పరిస్థితులను పరిశీలించి పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలకు అవసరమైన ఆహారంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రాజెక్టు అధికారి (ITDA PO), వారికి ప్రేరణాత్మక సూచనలు చేశారు. భవిష్యత్తులో లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల పరిసరాలలో పరిశుభ్రతను కాపాడాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీటి నిల్వల వల్ల దోమలు వ్యాపించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా వంటగది ఆవరణలో పోషక విలువలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయల మొక్కలను పెంచాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: Instagram

