కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి కార్మికుల 31 డిమాండ్ల సాధనకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ (AITUC) ఇచ్చిన సమ్మె నోటీసుపై గురువారం హైదరాబాద్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. డిప్యూటీ లేబర్ కమిషనర్ డాక్టర్ శాశ్వతి రథ్ (ఆర్ఎల్సీ) సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగ భద్రత, అమలు కాని ఒప్పందాలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయి. కార్మిక సంఘం నాయకులు సమస్యల తీవ్రతను వివరించగా, యాజమాన్యం తమ అభిప్రాయాలను వెల్లడించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, సమస్యలపై మరింత స్పష్టత కోసం ఆర్ఎల్సీ తదుపరి చర్చలను జూలై 10వ తేదీకి వాయిదా వేశారు.
యాజమాన్యం కార్మికుల న్యాయమైన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మెకు వెళ్లడం అనివార్యమని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత విషయంలో రాజీ పడేది లేదని, అవసరమైతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ చర్చల్లో ఏఐటీయూసీ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్, మిరియాల రంగయ్య, కే. సారయ్యలు పాల్గొనగా, యాజమాన్యం తరఫున ఏజీఎం (పర్సనల్) అజయ్ కుమార్ హాజరయ్యారు.

