కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో పిచ్చికుక్కల దాడి కలకలం రేపింది. ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలో బుధవారం నాడు పిచ్చికుక్కలు స్వైరవిహారం (Rabid Dog Attack) చేశాయి. గ్రామానికి చెందిన సుమారు పది మందిపై ఈ కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ముఖంపై కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గాయపడిన బాధితులందరినీ వెంటనే అంబులెన్స్లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉదయమే రెండు పిచ్చికుక్కలు గ్రామస్తులపై పడటంతో స్థానికులు తెగించి వాటిలో ఒక కుక్కను పట్టుకుని హతమార్చారు. అయితే మరొక పిచ్చికుక్క మాత్రం అక్కడి నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ పారిపోయిన కుక్క ఎప్పుడు ఏ వైపు నుండి వచ్చి మళ్లీ దాడి చేస్తుందోనని గుడిసెలపేట గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పారిపోయిన మరో పిచ్చికుక్కను కూడా వెంటనే పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

