కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నల్గొండ (Nalgonda) పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పట్టణంలో బ్యాగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షేక్ సుల్తాన్, అతని భార్య హసీనా, అలాగే వారి ఇద్దరు పిల్లలుగా మృతులను పోలీసులు గుర్తించారు.
ఇంటి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, కుళ్లిన స్థితిలో ఉన్న నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన సుమారు మూడు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని మృతదేహాల ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ ఘటన జరగడానికి ముందు రోజు ఆ కుటుంబంలో గొడవ జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘోర ఉదంతం తర్వాత సదరు కుటుంబంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం మిస్సింగ్ అయిన ఆ వ్యక్తిపైనే పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Read Also: రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!
Follow Us On: Instagram

