కలం, వెబ్ డెస్క్: ఖతార్ (Qatar)లోని ఓ గ్యాస్ ప్లాంట్లో సంభవించిన భారీ పేలుడులో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించగా, మరో 66 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో భారతీయులతో పాటు పాకిస్తాన్కు చెందిన వారు కూడా ఉన్నట్లు ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ కాబీ మీడియాకు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం తన తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది.
గత మార్చి నెలలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా ఈ గ్యాస్ ప్లాంట్లో భారీ నష్టం వాటిల్లింది. అప్పట్లో నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు తిరిగి పునరుద్ధరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బర్జన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఒక సాంకేతిక ప్రమాదం మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి శత్రుత్వ చర్యలు లేవని ఖతార్ (Qatar) మంత్రి స్పష్టం చేశారు. గాయపడిన 66 మందికి ప్రస్తుతం వైద్య చికిత్స అందుతోందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు.
ఈ పేలుడు వల్ల ప్లాంట్కు జరిగిన నష్టం వివరాలను ఖతార్ ఎనర్జీ ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ దీని వల్ల ప్రపంచ దేశాలకు జరిగే గ్యాస్ ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగదని, పర్యావరణానికి కూడా ఎటువంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ఖతార్ ఇంధన శాఖ తెలిపింది.
Read Also: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ!
Follow Us On: Sharechat

