కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి 99 డేస్ యాక్షన్ ప్లాన్కు (99 Day Action Plan) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే విద్య, వైద్యంతోపాటు అనేక అంశాలపై ఆయా జిల్లాల్లో సమీక్షా సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపట్నుంచే గ్రామసభలు జరిపేందుకు ఉత్తర్వలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామపంచాయతీల పాలనను పారదర్శకంచేసే దిశగా గ్రామ సభ (Gram Sabha) నిర్వహణపై నూతన మార్గదర్శకాలను (SOP) విడుదల చేసింది. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, నిర్ణయాధికారంలో సామాన్యులకు చోటు కల్పించడమే ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై ప్రతి గ్రామంలో నిర్ణీత కాలవ్యవధిలో సభలు నిర్వహించడం తప్పనిసరి చేస్తూ అధికారులు కఠిన నిబంధనలు రూపొందించారు.
ముందస్తు నోటీసులు, సన్నాహాలు
గ్రామ సభ నిర్వహణకు కనీసం ఏడు రోజుల ముందే గ్రామస్తులకు సమాచారం అందించాలని ఎస్.ఓ.పి స్పష్టం చేస్తోంది. కేవలం దండోరా వేయడమే కాకుండా, గ్రామ పంచాయతీ కార్యాలయం, పాఠశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నోటీసులు ప్రదర్శించాలి. సభలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే సిద్ధం చేసి, స్థానిక వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు తెలియజేయడం ద్వారా గరిష్ట హాజరును నిర్ధారించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సభల నిర్వహణ, చర్చనీయాంశాలు
సభ నిర్వహణలో కోరం (కనీస సభ్యుల సంఖ్య) ఉండటం అత్యవసరమని నిబంధనలు పేర్కొంటున్నాయి. సమావేశంలో గతేడాది ఖర్చులు, కొత్తగా చేపట్టాల్సిన పనులు, ఉపాధి హామీ పథకం అమలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై సమగ్రంగా చర్చించాలి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి జవాబుదారీగా ఉండాలని, సభలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పనిసరిగా ‘మినిట్స్ బుక్‘లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది.
పర్యవేక్షణ, సోషల్ ఆడిట్
గ్రామ సభల నిర్వహణ కేవలం నామమాత్రంగా సాగకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. సభ ముగిసిన తర్వాత తీసుకున్న తీర్మానాలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ‘సోషల్ ఆడిట్’ (సామాజిక తనిఖీ) నిర్వహించడం ద్వారా పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

