కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పంపిణీ చేసే బాలామృతంతో కోతులను చంపాలనే ప్లాన్ వేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది బాలామృతంలో విష గుళికలతో కలిపి నర్సరీ ప్రాంతంలో ఉంచారు. ఆ ఆహారంలో విషం ఉందనే విషయం తెలియక అశ్విన్ నందన్ (4) అనే నాలుగేళ్ల బాలుడు దానిని తిన్నాడు. తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్ష్యంతో చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

