కలం, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో పానీపూరి (Pani Puri) తిన్న పిల్లలు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం కేసీఆర్ నగర్లోని ఓ బండి వద్ద చాలా మంది పానీ పూరి తిన్నారు. ఆ తర్వాత కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. సుమారు 20 మంది చిన్నారులు ఒకే రకమైన అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. కుటుంబసభ్యులు తమ పిల్లలను ఆస్పత్రికి తరలించారు. సుమారు 15 మందికి పైగా పిల్లలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో రిషికేశ్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో పరిస్థితి విషమించింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. నిపుణులు పానీపూరీ బండి నుంచి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు.

