కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీస్ శాఖలో భారీ కుదుపు.. ఒకేసారి 19మంది ఎస్సై లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనను మరింత పరుగులెత్తించేందుకు, శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 19 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఆయన సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ బదిలీల వేటుతో జిల్లాలోని కీలక పోలీస్ స్టేషన్లలో ఒక్కసారిగా స్థానచలనం కలిగింది. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వరావుపేట వంటి కీలక సర్కిళ్లు, స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులందరికీ ఈ బదిలీల్లో స్థానాలు మారాయి.
ఈ బదిలీల్లో ఎస్పీ రోహిత్ రాజ్ మహిళా పోలీస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. జిల్లా (Bhadradri Kothagudem) లోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, జూలూరుపాడు పోలీస్ స్టేషన్లకు మహిళా ఎస్ఐలను కేటాయించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా అధికారుల నైపుణ్యానికి ఈ నిర్ణయం పెద్ద పీట వేసినట్లయింది. బదిలీల ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టం చేశారు. లూప్ లైన్ లేకుండా, బదిలీ అయిన అధికారులు ఎవరూ కాలయాపన చేయకుండా, వెంటనే తమకు కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

