కలం, వెబ్ డెస్క్: మావోయిస్టులు భారీ సంఖ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి ముందు ఈ రోజు సాయంత్రం లొంగిపోనున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం సమాచారం అందించింది. మొత్తం 124 మంది మావోయిస్టుల సరెండర్ను పోలీసులు చూపెట్టనున్నారు. వీరిలో ఎక్కువ మంది చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు. కొంతమంది తెలంగాణకు చెందినవారూ ఉన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, సెంట్రల్ మిలిటరీ కమిషన్కు చాలాకాలం బాధ్యుడిగా పనిచేసిన దేవ్జీకి చెందిన ప్రొటెక్షన్ టీమ్ సభ్యులు, ఆయనకు టచ్లో ఉన్న వివిధ పీఎల్జీఏ దళాలకు చెందినవారు తెలంగాణ పోలీసుల ముందు ఆయుధాలతో సహా లొంగిపోనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. దేవ్జీ గత నెలలో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చొరవతో మావోయిస్టు పార్టీకి చెందిన కంపెనీ, ప్లాటూన్ సహా దళాల సభ్యులు సరెండర్ కాబోతున్నారు. ఆపరేషన్ కగార్లో ఇప్పుడు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటు సాధించిన ఘనతగా ఉండబోతున్నది. ఒకేసారి 124 మంది లొంగిపోతున్నందున సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు.
మావోయిస్టుల (Maoists) నుంచి 134 ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. ఇంత మొత్తంలో ఆయుధాలు లభ్యమవడం రాష్ట్రంలోనే మొదటిసారిగా పోలీసులు భావిస్తున్నారు. అలాగే మావోయిస్టులు కూడా ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఇదే మొదటిసారి అని గుర్తుచేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన కీలక నేతలు గణపతి, మరో ఇద్దరు మాత్రమేనని స్వయంగా డీజీపీ గత నెలలో స్పష్టం చేశారు. మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన మేరకు ఆ దిశగా చర్యలు వేగవంతమయ్యాయి.
Read Also: డేరా బాబాకు బిగ్ రిలీఫ్.. జర్నలిస్ట్ హత్య కేసులో క్లీన్ చిట్!
Follow Us On : WhatsApp

