కలం, వెబ్ డెస్క్: డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబాకు పంజాబ్, హర్యానా హైకోర్టులో భారీ ఊరట లభించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్ట్ రాంచందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను హైకోర్టు కొట్టి వేసింది.
2002లో సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాంచందర్ ఛత్రపతి తన పత్రికలో డేరా సచ్చా సౌదాకు వ్యతిరేకంగా వార్తలు రాశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక రామ్ రహీమ్ కుట్ర ఉందని ఆరోపణలు రావడంతో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. 2019 జనవరిలో పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు డేరా బాబాతో పాటు మరికొందరిని దోషులుగా తేల్చి, వారికి జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత నేడు కోర్టు తుది తీర్పును వెలువరించింది.

