కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్గఢ్లోని బస్తర్ (Bastar) డివిజన్ ప్రధాన కేంద్రం జగదల్పూర్లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 108 మంది మావోయిస్టు క్యాడర్లు లొంగిపోయారు. ‘పూనా మార్గెమ్’ కార్యక్రమంలో భాగంగా ఈ లొంగుబాట్లు జరిగినట్లు అధికారులు తెలిపారు.
జగదల్పూర్లోని లాల్బాగ్ ప్రాంతంలోని శౌర్య భవన్, పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, కేంద్ర భద్రతా దళాలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కు చెందిన ఈ 108 మంది మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరుతున్నట్లు ప్రకటించారు.
అధికారుల వివరాల ప్రకారం, లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారంతో దేశంలో నక్సలిజం వ్యతిరేక ఆపరేషన్ల చరిత్రలోనే అతిపెద్ద డంప్ స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా సహా బస్తర్ (Bastar) రేంజ్లోని పలు జిల్లాల్లో భద్రపరిచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రిని కూడా కార్యక్రమంలో ప్రదర్శించారు. ప్రభుత్వం అందించే పునరావాస పథకాల ద్వారా లొంగిపోయిన మావోయిస్టులను సమాజంలో తిరిగి స్థిరపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

