కలం, వెబ్ డెస్క్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా మరోసారి దాడికి పాల్పడింది. డ్నిప్రో నగరంపై రష్యా చేసిన డ్రోన్ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మైన్ కార్మికులు బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి ఘటనపై తీవ్రస్థాయిలో ఖండించిన ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelenskyy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా రష్యాపై విమర్శలు చేశారు. డ్నిప్రోలో మైన్ కార్మికులను తీసుకెళ్తున్న బస్సుపై రష్యా డ్రోన్ దాడి ఘోర నేరమని జెలెన్స్కీ ఆరోపించారు. ఈ దాడి ద్వారా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పూర్తిగా రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చెడును ఇకనైనా ఆపాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు వచ్చే వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో త్రైపాక్షిక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జెలెన్ స్కీ తెలిపారు. ఫిబ్రవరి నెల మొత్తం విదేశాంగ శాఖకు సంబంధించి అత్యంత కీలకంగా ఉండబోతుందని పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించే చర్యల్లో అమెరికా మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా దాడులను తగ్గించే అంశంలో అమెరికా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఈ ప్రక్రియపై, దాని ఫలితాలపై నమ్మకం కలిగేలా అమెరికా ఏ మేరకు ముందడుగు వేయగలదన్నదే ఇప్పుడు ముఖ్యమని వ్యాఖ్యానించారు.


