కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల (YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ను కీలుబొమ్మగా మార్చి మోదీ రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించడంపై షర్మిల స్పందించారు. ఇన్నాళ్లు ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇక పై సీట్ చోరీకి తెరలేపిందని ఆరోపించారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా కుట్ర పన్నాయని ఆమె (YS Sharmila) ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పూనుకున్న మోదీ రాజ్యాంగ విలువలను అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. పోరాడే ప్రజల గొంతుకను రాజ్యాంగ సంస్థలతో కలిసి అణచి వేస్తూ ప్రధాని మోదీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. కేసులు, సాంకేతిక కారణాలను బూచిగా చూపి ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో తప్పించి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని షర్మిల ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలను ఎన్నికల సంఘం వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడడానికి ప్రజలందరూ బీజేపీ చర్యలను ఖండించాలని షర్మిల పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలో క్రిమినల్ కేసులో మీనాక్షి నటరాజన్ కు నోటీసులు, ఆస్తులు వెల్లడించలేదనే కారణంతో ఆమె నామినేషన్లను ఎన్నికల అధికారి తిరస్కరించారు.

