కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ ప్రారంభం కానున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యుహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరుకానున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రజా సమస్యలపై మండలి వేదికగా అనుసరించాల్సిన కార్యచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత, సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం, డీఎస్సీపై భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నిబంధనల వివాదం కొనసాగుతున్న వేళ శాసనమండలిలో అధికార ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ భావిస్తోంది. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

