కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్లో జరిగిన తొలి యోగాసన ప్రపంచ ఛాంపియన్షిప్ (Yogaasanas Championship) భారత్ ఆధిపత్యాన్ని మరోసారి చాటినా, మధ్యప్రాచ్య దేశాలకు ఈ టోర్నీ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. పతకాల కంటే పెద్ద విజయంగా యోగాసన క్రీడకు కొత్త దేశాల్లో దక్కిన ప్రోత్సాహం నిలిచింది. ఈ ఛాంపియన్షిప్లో 78 దేశాల నుంచి 522 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ అనుభవం, కోచింగ్ విధానాలు, న్యాయనిర్ణేతల ప్రమాణాలను తెలుసుకునే అవకాశం అనేక దేశాలకు లభించింది.
గల్ఫ్ దేశాల్లో ఒమన్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆ దేశం మొత్తం 21 పతకాలు గెలుచుకుంది. ఇందులో 8 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. 15 ఏళ్ల జే రాజేష్ సోనేజీ రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఈ విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఒమన్లో యోగాసనంపై మరింత అవగాహన పెరగడానికి ఈ టోర్నీ దోహదపడుతుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
జోర్డాన్ రెండు కాంస్య పతకాలు గెలుచుకుని తన ముద్ర వేసింది. పతక విజేత మాయా అలోస్తాత్ అభిప్రాయం ప్రకారం, తమ దేశంలో యోగా పట్ల ఆసక్తి ప్రతి ఏడాది పెరుగుతోంది. యోగాసనం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది సమతుల్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆమె తెలిపింది. ఈ టోర్నీ ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని కూడా ఆమె పేర్కొంది.
యూఏఈ, ఇరాన్ దేశాల క్రీడాకారులు పతకాల కంటే ముఖ్యమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటం ద్వారా తమ దేశాల్లో యోగాసన అభివృద్ధికి ఉపయోగపడే అంశాలను తెలుసుకునే అవకాశం వారికి లభించింది.
ఈ టోర్నీ ద్వారా పాల్గొన్న దేశాలు కోచింగ్ వ్యవస్థలు, పోటీ నిర్వహణ విధానాలు, క్రీడాకారుల అభివృద్ధి నమూనాలపై అవగాహన పెంచుకున్నాయి. దీంతో తమ దేశాల్లో బలమైన యోగాసన వ్యవస్థను నిర్మించేందుకు మార్గం సుగమమైంది.

