కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పేదల సంక్షేమంతో పాటు వారి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తువ్వగడ్డ తండా, టంకర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను విప్ ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. ఈ ఏడాది మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
ఇల్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి.మహేందర్, మహబూబ్ నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజు గౌడ్, నాయకులు మైత్రి యాదయ్య, టంకర కృష్ణయ్య యాదవ్ , సర్పంచి అచ్చెన్న, తిరుపతయ్య, లింగం నాయక్, గంగిరెడ్డి, నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.

