కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) హయాంలో రాజకీయ నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, సినీ నటులు.. ఇలా అన్ని వర్గాల్లో కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారని కాంగ్రెష్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. సోమవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)కు సంబంధించి తన స్టేట్మెంట్ రికార్డు చేయడానికి పోలీసులు నోటీసులు పంపించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్పై మార్చి 2024లో కాంగ్రెస్ ఎమ్మెలు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూల సూత్రదారుడు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది తేల్చాలని కోరినట్లు తెలిపారు. ఆ దర్యాప్తులో భాగంగా పలువురిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇది తమకు వ్యక్తిగత సమస్య కాదని యెన్నం స్పష్టం చేశారు.
రాజకీయంగా గెలవాలంటే ఎన్నికల్లో గెలవాలని, ప్రజలకు మంచి పథకాలు ఇచ్చిర, మెప్పించి గెలవాలని చెప్పారు. అంతే కానీ ఫోన్లలో ఎవరు , ఎవరితో ఏం మాట్లాడుతున్నారని తెలుసుకొని, వాటి ద్వారా ఎన్నికలు గెలవాలని కోరుకుంటే రాజకీయంగా ఆ వ్యక్తి చనిపోయినట్లేనన్నారు. ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి, ప్రజలు ఓట్లు వేయరని నిర్దారించుకొని ఈ అక్రమ పద్ధతులకు తెరలేపారన్నారు. ఎంతో మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వారి బలహీనతలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి కుట్ర చేశారన్నారు. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉన్న స్వేచ్ఛా, స్వాతంత్రాలను తుంగలో తొక్కారన్నారు. ఇప్పుటు కేటీఆర్, హరీశ్ రావు మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారని, మళ్లీ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. గతంలో వేలమంది ఫోన్లు ట్యాప్ చేసిన వారు మళ్లీ లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేస్తారని చెప్పారు. ఇలా తమకు ఓటు వేయని లక్షల మంది కుటుంబాల్లోకి కూడా తొంగి చూస్తారన్నారు. కాబట్టి ఇలాంటి పెడ ధోరణులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదని యెన్నం స్పష్టం చేశారు.

