వ్యక్తిగత గొడవలకు బీజేపీని బలిచేయొద్దు: గంగులపై సునీల్‌రావు ఫైర్!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యక్తిగత గొడవలు, తగాదాలను సాకుగా మలుచుకొని భారతీయ జనతా పార్టీకి వాటిని అంటగట్టడం చాలా దారుణం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) మండిపడ్డారు. కరీంనగర్ లో మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కిసాన్ నగర్ ప్రాంతంలో జరిగిన గొడవపై సునీల్ రావు ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. బీజేపి కార్పొరేటర్ సోమిడి వేణును గతంలోనే కారుతో డీ కొట్టి దాడిచేసి గాయపరిచారని తెలిపారు. ఆ దాడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. కానీ అప్పుడు ఎవరిపై నిందారోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయనపై చేసిన దాడిని వ్యక్తిగత ధాడిగానే బావించాం తప్పా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంటగట్టే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని శాసన సభ్యులు గంగుల కమలాకర్ గమనించాలని హితువు పలికారు.

నాలుగు సార్లు శాసన సభ్యులుగా గెలిచామని చెబుతున్నా గంగుల కమలాకర్.. వ్యక్తిగత కక్షలను, దాడులను తమ పార్టీ పై రుద్దడం మానుకోవాలని హెచ్చరించారు. కిసాన్ నగర్ ఘటనను బీజేపీ పార్టీకి అంటగడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడం మంచిదికాదని మండిపడ్డారు. బాధ్యత గల వ్యక్తులు ఎక్కడ గొడవలు జరిగినా… సద్దుమణిగించే ప్రయత్నం చేయాలే తప్పా… చలిమంటలను కాచుకునే విధంగా వ్యక్తిగత గొడవలు, తగాదాలను తమ పార్టీపై రుద్దే ప్రయత్నం చేయడం మానుకోవాలని విరుచుకుపడ్డారు.

ఈ ఘటన విషయంలో ప్రధానంగా తమ పార్టీ నాయకులు బండి సంజయ్ కుమార్ పేరును వాడటం చాలా దుర్మార్గమని నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీకి మేయర్ పదవిని కట్టబెడితే దాడులకు పాల్పడుతున్నారని ఘోరమైన వాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గత పది సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు మంత్రిగా కొనసాగినంత కాలం ఎక్కడ వ్యక్తిగత గొడవలు తగాదాలు జరగలేదా…? మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఎప్పుడు బాధ్యులుగా చూపలేదా…? అని గంగులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎంతమందిని గొడవలు, తగాదాల విషయంలో విచారించి చర్యలు తీసుకున్నారో గంగులకు తెలియదా? అని నిలదీశారు. ఆయా గొడవలకు , తగాదాలకు బాధ్యత మీరే వహిస్తారా? అని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించేలదనే అక్కసుతో ఈ విధంగా ఆరోపణలు చేయడం భావ్యం కాదని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 66 సీట్లలో 9 స్థానాలకే పరిమితం అయిన పార్టీ మీదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ను గొప్పగా అభివృద్ధి చేస్తా ఉంటే… బీజేపీ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని చెప్పడం ఎంతవరకు సబబు అని వ్యాఖ్యానించారు .

అధికారం ఎవరికి శాశ్వతం కాదని… అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడటం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ నగర అభివృద్ధి జరగిందని ప్రజలు విశ్వసించి… భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలిపించి మేయర్ పీఠం కట్టబెట్టారని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమార్ పై ఉన్న విశ్వాసం, అభివృద్ధిపై ఉన్న నమ్మకంతో బీజేపీ పార్టీని ఆదరించారని తెలిపారు. దాన్ని గంగుల కమలాకర్ జీర్ణించుకోలేక ఎక్కడ ఏ అవకాశం దొరికితే అక్కడ బట్టకాల్చి మీద వేస్తున్నారని ధ్వజమెత్తారు.

వ్యక్తిగతంగా గొడవలు చాలా జరుగుతాయని, ఈ పద్దతి సరికాదని హెచ్చరించారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పోలీస్ కేసులు అయ్యాయో స్టేషన్లలో రికార్డు తీసుకోవాలన్నారు. ఎక్కడో జరిగిన వ్యక్తిగత గొడవలు తగాదాలను సాకుగా మలుచుకొని భారతీయ జనతా పార్టీని…. తమ నాయకులను బద్నాం చేయడం ఎంతవరకు సబబు అని విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధే మా ఎజెండా అని, దాడుల సంస్కృతి మాది కాదన్నారు. బీజేపీ పార్టీ గానీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గానీ దాడులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భారతీయ జనతా పార్టీని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నంలో తమ పాలకవర్గం బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని వెల్లడించారు.

తమ పార్టీ పాలకవర్గం ఏర్పడి 5 నెలలు కూడ గడవనేలేదు…. గంగుల కమలాకర్ ఇంత అసూయ అక్కసు తమపై చూపించడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. మీ పార్టీ అభిప్రాయాలు, విశ్వాసం మాకు అవసరం లేదని.. ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో తమ పార్టీ నాయకులు ప్రజల నమ్మకం విశ్వాసంతో ఎన్నుకోబడ్డ వ్యక్తులని తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దీన్ని గమనించాలని… నిందారోపణలు వేయడం కాదని హితువు పలికారు.

కార్పొరేటర్లుగా పనిచేసిన వ్యక్తులు రకరకాల కారణాలతో జైల్లోకి వెళ్లారు మేము ఎనాడు ఎవరిపై ఆరోపణలు చేయలేదన్నారు. ఇలాంటి పద్దతి మంచిది కాదని… గంగుల కమలాకర్ బట్టకాల్చి మీదేసే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని…. గెలిచినవారే గొప్ప అని విర్రవీగుతూ….ఓడినవారిని హేలన చేయడం…. గెలిచిన వారిపై నిందలు వేయడం తగదని, ఇది దుర్మార్గమైన చర్య అని నిప్పులు చెరిగారు. బీజేపీ పాలకవర్గ సభ్యులు కరీంనగర్ నగర అభివృద్ధి పై దృష్టి పెట్టి కార్యాచరణ రూపొందిస్తుంటే గంగుల కమలాకర్ మాత్రం గొడవలు తగాదాలను అంటగడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. నగరంలో బీజేపీకి అధికారం కట్టబెట్టారనే ప్రజల మీద కోపాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేయడం గంగులకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఇప్పటికైన గంగుల కమలాకర్ ఇలాంటి చౌకబారు ఆరోపణలు నిందలు వేయడం మానుకోవాలని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, ఓంటెల సత్యనారాయణ రెడ్డి, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, పొన్నం మొండయ్య గౌడ్, బండారి వేణు, కె ఏపిపి చంద్ర (టింకు), దేవసాని సత్యనారాయణ, నాంపల్లి శ్రీనివాస్, కర్రె అనిల్, తోట అనిల్, కో ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, చిగురు రవి, నాయకులు పండుగ నాగరాజు, వెంకట్ రెడ్డి, శివ, చంద్రమౌళి, అనిల్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>