కలం, హనుమకొండ : బాలసముద్రం రెండు పడకల గదుల సముదాయంలో ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP)ను (Balasamudram Plant) యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బాలసముద్రంలోని రెండు పడకల గదుల సముదాయాన్ని సందర్శించిన కమిషనర్, అక్కడి 300 కేఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్థానిక అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను పునరుద్ధరించేందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం 59వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో నిర్వహించిన అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని, స్థానిక కాలనీ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు అవెన్యూ ప్లాంటేషన్ను ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు. ఈ పర్యటనలో సూపరింటెండెంట్ రాజ్కుమార్, ఇన్చార్జి హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పందన పాల్గొన్నారు.

