కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రిభువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ కమిటీలో జిల్లా ఉపాధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులు, స్పోక్స్ పర్సన్, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో కలిపి 66 మందితో జాబితాను గురువారం రిలీజ్ చేశారు. ఇందులో ఏడుగురు ఉపాధ్యక్షులు కాగా, 12 మంది జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఒక స్పోక్స్ పర్సన్, 29 మంది కార్యదర్శులతో పాటు మరో 17 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ల పేర్లను ప్రకటించారు.
డీసీసీ అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేరును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన జాబితాలో ఏడుగురు ఉపాధ్యక్షుల్లో నలుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఈ డీసీసీ కమిటీలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

