కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. రేపు (మార్చి 27, శుక్రవారం) శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని జంటనగరాల పరిధిలో మద్యం షాపులు మూసివేయాలని (Liquor Shops Closed) తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు నగరవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ ‘డ్రై డే’ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలు నిలిపివేయబడతాయి.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపినా లేదా షాపులు తెరిచినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక రేపు అంతా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలుసుకున్న మద్యం ప్రియులు.. దగ్గర్లో ఉన్న మద్యం షాపులకు పరుగులు తీస్తున్నారు. రేపు మద్యం దొరకదు కాబట్టి ఇప్పుడే కొనుక్కోవడానికి ఎగబడుతున్నారు. రేపటి కోటా కూడా ఈ రోజే కొనుగోలు చేస్తున్నారు.

