కలం, వెబ్ డెస్క్: దేశ ప్రధానిగా 12 ఏళ్ల పాలనా కాలం పూర్తి చేసుకున్న మోదీని (PM Modi) వివిధ దేశాధినేతలు అభినందిస్తూ లేఖలు రాశారు. దేశాభివృద్ధి, ఆసియా దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి, సమగ్ర ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారత్లో ఆర్థిక, సామాజిక మార్పులు వచ్చాయని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ప్రశంసించారు. మోదీ విజన్ శ్రీలంకతో సహా అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలకు గుర్తుగా “మిత్ర విభూషణ” పురస్కారాన్ని కూడా అందించినట్లు ప్రస్తావించారు. మోదీని ప్రపంచ నాయకులకు ఆదర్శంగా పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే కొనియాడారు. మోదీ తన నాయకత్వ పటిమతో 20 కోట్లకు పైగా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారత్ విదేశాంగం, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో బలోపేతమైందని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్షాద్ ప్రశంసించారు.

