కలం, ఖమ్మం బ్యూరో : బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి (న్యాయమూర్తి) ఎం. రాజేందర్ తెలిపారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం(World Day Against Child Labour) సందర్భంగా మణుగూరు (Manuguru) మండలం సీతారాంపురంలోని ఇటుక బట్టీల యజమానులతో శుక్రవారం ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణ పొందే హక్కు ఉందని అన్నారు. బాలలను పనిలో నియమించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం ఆయన ఇటుక బట్టీలను స్వయంగా పరిశీలించి, కార్మికుల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు హాజరవుతున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని బడికి పంపే బాధ్యత యజమానులపై కూడా ఉందని సూచించారు. బాల కార్మిక నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, అధికారులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా చైతన్యంతో ముందుకు వస్తేనే ఈ సమస్యను పూర్తిగా నివారించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం లేబర్ ఆఫీసర్ నాగరాజు, ఇటుక బట్టీల యూనియన్ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండలరావు, యజమానులు తదితరులు పాల్గొన్నారు.

