కలం, జోగుళాంబ గద్వాల: జోగుళాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఎలక్ట్రికల్ దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. ఈ నెల 8వ తేదీన సోమవారం రాత్రి మల్దకల్ మండల కేంద్రంలోని సిరి ట్రేడర్స్ ఎలక్ట్రికల్ దుకాణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.53 వేల నగదు అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తాటికుంట స్టేజ్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. కర్నూలు జిల్లాకు చెందిన ఎం.వంశీ, మాల వెంకటేష్ ఎలక్ట్రికల్ దుకాణంలో దొంగతనానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రూ. 40,200 నగదు, దొంగతనానికి ఉపయోగించిన ఆటో (AP-39-TQ-0761), తాళాలు పగులగొట్టడానికి వాడిన రెండు స్పానర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి గద్వాల కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ టి.శ్రీనివాసరావు అభినందించారు.

