కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం (Burgampadu Accident) చోటుచేసుకుంది. మండలంలోని మర్రికుంట సమీపంలో వేగంగా వచ్చిన లారీ, స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఒక మహిళ తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం ఇద్దరు మహిళలు స్కూటీపై తమ వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తుండగా, మర్రికుంట సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళలు రోడ్డుపై పడిపోయారు. వారిలో ఒక మహిళకు శరీర భాగాలపై తీవ్రమైన గాయాలు కాగా, మరో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న క్షతగాత్రులను కాపాడి, చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు ఆసుపత్రిలో అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు, బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బూర్గంపాడులో ఘోర ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు!

