కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాకు చెందిన డిజిటల్ మీడియా మహిళా జర్నలిస్టు (Woman Journalist) పాపినేని అనంత లక్ష్మి.. భర్త ఇక లేరని తెలిసిన తీవ్ర దుఃఖంలో కూడా, ఆయన అవయవాలను దానం చేసి మరికొందరికి ప్రాణదాతగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం (Khammam) జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన పాపినేని నాగేశ్వరరావు మొక్కజొన్న విత్తన కంపెనీలో ప్రతినిధిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య అనంత లక్ష్మి ఒక డిజిటల్ మీడియా సంస్థలో వెబ్ ఇంచార్జ్గా, సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఒక రోజు విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళ్లిన నాగేశ్వరరావు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఐదు రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే తన జీవిత భాగస్వామిని కోల్పోయిన బాధలో కూడా అనంత లక్ష్మి (Woman Journalist) ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది.
తన భర్త అవయవాలను దానం చేయాలని నిర్ణయించింది. తన వ్యక్తిగత దుఃఖాన్ని పక్కనబెట్టి, మరికొందరికి ప్రాణాలు ఇవ్వాలని ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ కదిలించింది. ఆ అవయవాల ద్వారా నాగేశ్వరరావు మరికొందరికి ప్రాణదాతగా నిలిచారు. నాగేశ్వరరావుకు భార్య అనంత లక్ష్మితో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
Read Also: చంద్రుడి చెంతకు నలుగురు వ్యోమగాములు.. వీడియో విడుదల
Follow Us On: X(Twitter)

