కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని దమ్మాయిగూడ (Dammaiguda)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఒక మహిళను హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా బూరుగుపల్లికి చెందిన విజయ అనే మహిళగా మృతురాలిని గుర్తించారు. భర్త మరణించిన తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన విజయ, అక్కడ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తూ జీవిస్తోంది.
సాధారణంగా పనికి వెళ్లిన విజయ సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం దమ్మాయిగూడలోని ఒక వైన్స్ షాప్ వెనుక ఆమె మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, దుండగులు విజయ తలపై రాయితో బలంగా కొట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దారుణ సంఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తోంది.

