కలం, వెబ్ డెస్క్: సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుండి మన చర్మాన్ని సంరక్షించుకునేందుకు సన్స్క్రీన్ (Sunscreen) వాడుతుంటాం. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. సన్స్క్రీన్ కేవలం ఎండాకాలంలో మాత్రమే వాడాలా? మిగిలిన కాలాల్లో కూడా వాడాలా అని? దీనిగురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆకాశం మబ్బుగా ఉన్నా, చలిగా ఉన్నా కూడా సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు మన చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఎండాకాలంతో సంబంధం లేకుండా.. అన్ని కాలాల్లోనూ తప్పనిసరిగా సన్స్క్రీన్ ఉపయోగించాలని చెబుతున్నారు. మేఘాలు సూర్య కాంతిని కొంతవరకు అడ్డుకున్నప్పటికీ చర్మానికి హాని కలిగించే అతినీలలోహిత కిరణాలను పూర్తిగా నిరోధించలేవు. అందువల్ల ప్రతిరోజూ సన్స్క్రీన్ ఖచ్చితంగా ఉపయోగించాలని చెబుతున్నారు నిపుణులు.
కొంత మంది కేవలం ఎండకు వెళ్లినప్పుడు మాత్రమే సన్స్క్రీన్ రాసుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్స్క్రీన్ రాసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో కిటికీ పక్కన కూర్చొన్నా లేదా వాహనం నడుపుతున్నా అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడుతుందట. దీనివల్ల చర్మపు రంగు సహజకాంతిని కోల్పోవడం, ముడతలు, సన్నని గీతలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతిరోజూ సన్స్క్రీన్ రాసుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఎక్కువసేపు బయట గడిపేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్స్క్రీన్ రాసుకోవాలని సూచిస్తున్నారు. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ ఉపయోగించాలని తెలిపారు. అయితే వర్షాకాలంలో తేలికపాటి, జిడ్డు లేని సన్స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే వాతావరణం ఎలా ఉన్నా రోజూవారీ చర్మ సంరక్షణలో సన్స్క్రీన్ భాగం చేసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల పిగ్మెంటేషన్, ముందస్తు వృద్ధాప్య ఛాయలు, దీర్ఘకాలిక చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.

