కలం, వెబ్ డెస్క్: సామాజిక సంబంధాలకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా గడిపితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తోపాటు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం వల్ల శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లు పెరిగి, రక్తపోటుకు దారితీస్తుంది. క్రమంగా గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు కలిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒంటరిగా ఉండేవారు వయసుతోపాటు జ్ఞాపకశక్తి లోపం లాంటి సమస్యల బారిన పడుతారని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసిమెలిసి ఉండటం అవసరం. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు వర్చువల్ ప్రపంచానికి పరిమితమై, నిజ జీవిత బంధాలకు దూరమవుతున్నారు. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తూ, సామాజిక కార్యకలాపాలలో పాలుపంచుకోవాలి. పెద్దలు కూడా ఒంటరితనాన్ని దరిచేరనీయకుండా నలుగురితో కలిసి తిరగడం వల్ల ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

