కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం (Election Campaign) మంగళవారంతో ముగియనుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలవరకు ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఉదయం నుంచే అభ్యర్థులంతా ప్రచారం నిర్వహించనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న 152 అసెంబ్లీ సీట్లకు తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏప్రిల్ 29న 142 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీపై విరుచుకుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో తమ టీఎంసీ పార్టీ గెలిచే విధంగా వివరిస్తున్నారు. అటు బీజేపీ, ఇతర పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 9న కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. తదుపరి ఎన్నికలు ఈ నెల 23న పశ్చిమ బెంగాల్లో కొన్ని స్థానాల్లో, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరుగనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండు రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలో ఏ పార్టీ అధికారం లోకి వస్తుందో, ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారో అన్న ఉత్కంఠ రాజకీయ శ్రేణులతో పాటు ప్రజల్లో నెలకొంది.

