కలం, వెబ్ డెస్క్ : ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) వాహనాల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, నాసిరకం సర్వీసింగ్పై వినియోగదారుల కమిషన్ కీలక తీర్పునిచ్చింది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి వరుసగా ఎదురవుతున్న సమస్యలపై సకాలంలో స్పందించని సంస్థకు భారీ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి 2023 నవంబర్ 9వ తేదీన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) స్కూటర్ను కొనుగోలు చేశారు. అయితే వాహనం తీసుకున్న కొద్ది రోజుల్లోనే అది మొరాయించడం ప్రారంభించింది. అనేకమార్లు సర్వీస్ సెంటర్కు తిరిగినా, అక్కడి సిబ్బంది ఆ లోపాలను శాశ్వతంగా పరిష్కరించడంలో విఫలమయ్యారు. కొత్త వాహనం కొన్న సంతోషం కంటే దాని వల్ల కలిగిన ఇబ్బందులే ఎక్కువ కావడంతో, సంతోష్ రెడ్డి న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కమిషన్, వినియోగదారుడి పక్షాన ఉన్న వాదనలు ఏకీభవించింది. సంస్థ సేవా లోపాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, సంతోష్ రెడ్డికి వాహనం ధర రూ. 1,19,999.. ఇన్సూరెన్స్ కింద చెల్లించిన రూ.7,243 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఓలా సంస్థను ఆదేశించింది. వీటితో పాటు వినియోగదారుడికి కలిగిన మానసిక వేదనకు పరిహారంగా రూ.5,000, న్యాయపోరాటం కోసం ఖర్చు చేసిన మరో రూ.5,000 కలిపి మొత్తం సొమ్మును బాధితుడికి చెల్లించాలని తన తీర్పులో స్పష్టం చేసింది.

