కలం, వరంగల్ బ్యూరో : అధికారం కోల్పోయినా బుద్ధి రాలేదని, ఇప్పటికీ కొందరు ప్రతిపక్ష నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ (Naini Rajender) రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వరంగల్ పోలీస్ పోలీస్ కమిషనర్ను ఆయన కలిసి, ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కాలంలో అధికారులపై దాడులకు పాల్పడిన నాయకత్వం ఇప్పటికీ అదే స్వభావంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తపై దాడి హేయమైన చర్య అన్నారు. గతంలో తోట పవన్ అనే కార్యకర్తపై జరిగిన దాడిని గుర్తుచేస్తూ.. ఇవి క్రమపద్ధతిలో జరుగుతున్న దాడుల్లో భాగమని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఓపిక పట్టాలని సూచిస్తున్నప్పటికీ, ఆ సహనాన్ని ప్రతిపక్షాలు బలహీనతగా భావిస్తున్నాయని నాయిని వ్యాఖ్యానించారు. ఇకపై కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.
అప్పుడు తీర్మానం చేసి.. ఇప్పుడు రాజకీయమా?
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ తీరుపై నాయిని(Naini Rajender) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ లాభాల కోసం జిల్లాను ముక్కలు చేశారని ఆరోపించారు. భద్రకాళి ఆలయ పరిసరాల్లో గుడిసెల తొలగింపుపై గతంలో తీర్మానం చేసి, ఇప్పుడు అమ్మవారి పేరుతో రాజకీయాలు చేయడం ద్వంద్వ వైఖరని విమర్శించారు.
ప్రశాంత నగరాన్ని అస్థిరపరిచేలా వ్యవహరిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నగర బహిష్కరణ చేయాలని పోలీసులను కోరారు. గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు కూడా అదే నాయకత్వం ప్రోత్సాహం ఇచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనపై ప్రతిపక్ష నేతలు అవాకులు చెవాకులు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


