కలం, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్ డిప్యూటీ కలెక్టర్ (Warangal Deputy Collector) వెంకట్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో సుమారు 10 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించిన అధికారులు ఆయనను అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్ 5వ తేదీన ఒక ప్రైవేట్ స్కూల్ గుర్తింపు ఫైలును క్లియర్ చేసేందుకు 60 వేల రూపాయల లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆయన హనుమకొండ జిల్లా ఇన్ఛార్జ్ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పట్లోనే ఆయన ఇంట్లో జరిపిన తనిఖీల్లో 30 లక్షల రూపాయల నగదు లభించడంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలోని వెంకట్ రెడ్డి (Warangal Deputy Collector) నివాసాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. రెండు విల్లాలు, పది ఖరీదైన ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బ్యాంకు ఖాతాల్లో ఉన్న 50 లక్షల రూపాయల నగదు నిల్వలు, రెండు కిలోల బంగారం, పలు బినామీ ఆస్తులను గుర్తించారు.
లంచం కేసులో పట్టుబడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయగా, తాజాగా బయటపడిన ఈ అక్రమాస్తుల నేపథ్యంలో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. భారీగా నగదు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ బృందాలు, ఈ అక్రమ సంపాదనకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నాయి.
Read Also: పంబన్ బ్రిడ్జి.. ఆధునిక రామసేతుకు ఆఖరి వీడ్కోలు
Follow Us On: Instagram


