కలం, హనుమకొండ : రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత (Warangal CP) అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడాలని సూచించారు. హక్కుల కోసం పోరాడటంతో పాటు బాధ్యతలను నిర్వర్తించడం కూడా ముఖ్యమన్నారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, కష్టపడి తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
కలెక్టర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం, జాతీయ పతాకం వెనుక ఉన్న త్యాగాలను యువత ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్, యక్షగానం, క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విజేతలకు సీపీ, కలెక్టర్ బహుమతులు అందజేశారు.

