కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) నగర పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. ఉర్సుగుట్ట సమీపంలోని కళింగ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి చొక్కా లేకుండా హల్చల్ చేస్తూ, అనుచితంగా ప్రవర్తించాడు. బార్ సిబ్బంది సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, అతడిని చొక్కా వేసుకోవాలని చెప్పాడు.
అయితే, సదరు వ్యక్తి ససేమిరా అనడమే కాకుండా తీవ్రమైన వాగ్వాదానికి దిగాడు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్పై చేయి చేసుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విధి నిర్వహణలోని పోలీస్ అక్కడున్న స్థానిక వ్యక్తులు కలిసి అతడికి దేహశుద్ధి చేశారు.
తరువాత జరిపిన విచారణలో ఆ వ్యక్తి మామునూరు నాలుగో బెటాలియన్కు చెందిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP) కానిస్టేబుల్ మనోజ్గా గుర్తించారు. మద్యం మత్తులో ఈ వీరంగానికి పాల్పడినట్లు తేలింది. విధులకు ఆటంకం కలిగించడం, దాడికి దిగినందుకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు.

