కలం, వెబ్ డెస్క్: ఒమన్ (Oman) తీరంలో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ వాణిజ్య నౌకపై అమెరికా దళాలు చేసిన బాంబుల దాడిలో ముగ్గురు భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మృతుల వివరాలను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఇందులో విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద చౌరాసియాతో పాటు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల (Patnala Suresh)గా అధికారులు గుర్తించారు. సురేశ్ మృతిని ఢిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు కూడా అధికారికంగా ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు.
ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, అందులో 24 మంది భారతీయులే కావడం గమనార్హం. దాడి అనంతరం ప్రాణాలతో బయటపడిన మిగిలిన 21 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై దౌత్యపరంగా అమెరికాకు తన బలమైన నిరసనను తెలియజేయడంతో పాటు, వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులను వెంటనే నిలిపివేయాలని భారత్ స్పష్టం చేసింది.

