కలం, కరీంనగర్ బ్యూరో: దేశంలోని అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ కార్మికవర్గ శ్రేయస్సు కోసం వారి వేతనాల పెంపు హక్కులు, చట్టాలను కాపాడేందుకు నిరంతరం ఏఐటీయూసీ (AITUC) ఉద్యమాలు నిర్వహిస్తుంది అని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. గురువారం కరీంనగర్ (Karimnagar) లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఏఐటీయూసీ ఆఫీస్ బేరర్స్, దాని అనుబంధ సంఘాల ముఖ్య నేతల సమావేశం ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్. బోస్, కలవేన శంకర్, ఎస్. బాల రాజు, పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ కార్మిక సంఘాలలో మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఉందని, కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొందని తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచిందని అన్నారు.
శ్రమకు తగ్గ ఫలితం కావాలని, పని గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనాల కోసం నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ఎంతోమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి అనేక చట్టాలు తీసుకువచ్చిన కార్మిక సంఘమని, చట్టాలు, హక్కులను కూడా కాపాడిన సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలిపారు.
కార్పోరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల, కర్షకుల వ్యతిరేకిగా కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి కార్మికులకు తీరని అన్యాయం మోడీ చేశాడని వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగవ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం, నాయకత్వం పనిచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఇంచార్జీ, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, ఎస్.బాల రాజు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మహాసభల ఫ్యాట్రన్ కలవేన శంకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కడారి సునీల్, ఎండీ ముక్రం, సుతారి రాములు, అజ్ఞ వేణు, కడారి రాములు, ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, పిట్టల సమ్మయ్య, కాశెట్టి లక్ష్మయ్య, వెళ్దండి దామోదర్, అల్లేపు రాజు, నిఖిల్, కేంసారం నర్సయ్య, కొమురయ్య, కవిత, స్వరూప, రాధ, మమత, భీరయ్య, ఎం.తిరుపతి, గందే కొమురయ్య, గంగుల ఆయిలయ్య తదితరులు పాల్గొన్నారు.

