కలం, వెబ్డెస్క్: పార్లమెంట్లో ఇటీవల పలు బిల్లులకు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదముద్ర వేయడంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగానే సభకు అంతరాయం కలుగుతుందనే తీరులో ఆయన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో బిల్లులు సరైన చర్చ లేకుండానే ఆమోదం పొందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగడం లేదన్నారు. అదే సమయంలో ట్యాక్స్ పేయర్ల డబ్బు వృథా అవుతోందని తెలిపారు. తాను రాజ్యసభ ప్యానెల్ ఆఫ్ వైస్-చైర్పర్సన్స్ సభ్యుడిగా సభకు అధ్యక్షత వహించిన సమయంలో నిరసనలు జరిగినప్పటికీ సభా కార్యక్రమాలు కొనసాగించేలా చూసేవాడిని అని గుర్తు చేశారు. సభలోని మైక్రోఫోన్లకు నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉండటంతో, సభ్యులు నిరసనలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఇస్తూనే సభా కార్యకలాపాలను కొనసాగించేవాళ్లమని వెల్లడించారు.

